Budget session of Telangana Assembly: తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్

కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసారి బడ్జెట్ సమావేశాలు గవర్నర్ (తమిళిసై) ప్రసంగం లేకుండానే ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మార్చి నెల 7 వ తేదీ నుంచి దాదాపు 12 రోజులు బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కాగా, బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఈ రోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రలు కేటీఆర్, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం మార్చి 7న ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్‌పై కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ఇక ఈసారి అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై తెలంగాణ సర్కారు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి గవర్నర్ ప్రసంగం ముగిసిన తరువాత అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. ఇక అంతకుముందు 2014, 1970లోనూ గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగాయి.