హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఫుడింగ్‌ అండ్ మింక్‌ పబ్‌లో డ్రగ్స్‌ బయటపడటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆదివారం రాత్రి ఈ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి సుమారు 150 మందికిపైగా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్ర‌స్తుతం పోలీసుల అదుపులో ఉన్న వారిలో మెగా డాటర్ నిహారిక , బిగ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తోపాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ఉన్న‌ట్టు మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రాడిస‌న్ బ్లూ హోట‌ల్ ఘ‌ట‌న‌పై రాహుల్ సిప్లిగంజ్‌ స్పందించారు.

ఈ డ్రగ్స్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధంలేదని రాహుల్ సిప్లిగంజ్‌ తేల్చిచెప్పాడు. తన స్నేహితుని పుట్టినరోజు పార్టీకి కుటుంబ సభ్యులతో కలిసి హాజరైనట్లు పేర్కొన్నాడు. ఈ పార్టీలోతానూ అసలు డ్రగ్స్‌ తీసుకోలేదని, తనకు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు లేదని, స్పష్టం చేశాడు. దయచేసి తనపై అనవసర ప్రచారాలు చేయవద్దని మీడియాకి విజ్ఞప్తి చేశాడు. ఈ కేసులో పోలీసులు విచారణకు ఎప్పుడు పిలిచిన వెళ్తానని రాహుల్ సిప్లిగంజ్‌ వెల్లడించాడు. కాగా, బంజారాహిల్స్‌లో డ్రగ్స్ దొరికిన ఘటనను పోలీస్ శాఖ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయమై బంజారాహిల్స్ సీఐ శివచంద్రపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ సీఐగా శివచంద్ర స్థానంలో నాగేశ్వరరావును కొత్త సీఐగా నియమించారు.