సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మైంట్‌, 14 రీల్స్ ప్లస్ సంస్థల నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. మ్యూజిక్‌ సెన్సెషన్‌ తమన్‌ స్వరాలు అందిస్తున్న ఈ సినిమా బ్యాంక్ మోసాల నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది.

అయితే ‘సర్కారు వారి పాట’ మూవీ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త అప్‌డేట్ వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.. వాస్తవానికి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమై చాలా రోజులే అవుతున్నా అనివార్య కారణాలతో మధ్యమధ్యలో విరామం రావడంతో రెగ్యులర్ అప్‌డేట్స్ రాలేదు. ఈ నేపథ్యంలో ‘శ్రీ శుభకృత్‌ నామ’ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మహేశ్ బాబు స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నారు. రౌడీలను చితకొట్టేందుకు యాక్షన్ మోడ్‌లోకి వస్తున్న మహేశ్ బాబు యాటిట్యూడ్ అభిమానులు, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని మే 27న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చిత్రబృందం స‌న్నాహాలు చేస్తున్నారు.