మెగాస్టార్‌ చిరంజీవి ( Chiranjeevi ) హీరోగా కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య'(Acharya). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లై ట్రైలర్, టీజ‌ర్ అభిమానుల్లో భారీ అంచ‌నాలను పెంచేశాయి. అయితే ఈ సినిమా విడుద‌ల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ క్ర‌మంలో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 23న విజ‌యవాడ‌లోని సిద్దార్థ జూనియ‌ర్ కాలేజ్‌లో నిర్వహించ‌నున్నారని, ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఆంద్ర్రప్రదేశ్ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రానున్నారని వార్తలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన మరో కీలక అప్‌డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో దర్శకుడు కొరటాల శివ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఈ నేపథ్యంలో ఈ నెల 23న విజయవాడలో జరగాల్సిన ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను హైదరాబాద్‌ మార్చారని, ప్రస్తుతం ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించడానికి చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయని తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా చందమామ కాజల్ హీరోయిన్‌గా నటించగా.. రామ్‌ చరణ్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. అలాగే సోనూసూద్‌ ముఖ్య పాత్ర పోషించాడు.