అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ మల్టీ స్టారర్‌ చిత్రం “రౌద్రం.. రణం.. రుధిరం” (ఆర్‌ఆర్‌ఆర్‌) దర్శకదీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (Rajmouli)దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌(Ntr), అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌(Ramcharan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తారక్‌ సరసన ఒలివియా మోరీస్‌, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. దాదాపు రూ. 400 కోట్లు భారీ బడ్జెట్‌తో ఈ పాన్‌ ఇండియా సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. కాగా, ఈ మోస్ట్​ అవేయిటెడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ జోరు పెంచారు చిత్రబృందం. దేశవ్యాప్తంగా రోజుకో నగరం తిరుగుతూ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం (మార్చి 20) బరోడా(గుజరాత్‌), ఢిల్లీలో ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రబృందం గుజ‌రాత్‌లోని స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ‘స్టాచ్యు ఆఫ్ యూనిటీ’ విగ్రహాన్ని (Statue of Unity)ని సంద‌ర్శించారు. ఈ క్రమంలోనే ఈ ప్ర‌దేశాన్ని సందర్శించిన తొలి భారతీయ‌ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు సాధించింది. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం ‘స్టాచ్యు ఆఫ్ యూనిటీ’ని సందర్శించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.