బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో రేవ్ పార్టీ జరుగుతోందని పక్కా సమాచారంతో గత రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదివారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో జరిగిన ఈ దాడుల్లో దాదాపు 150 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. వీరిలో ప్రముఖ నటుడు కొణిదెల నాగబాబు కుమార్తె నిహారిక, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ వాడారని పోలీసులు చెబుతున్నారు.

అదుపులోకి తీసుకున్న 150 మందిలో 45 మందిపై డ్రగ్స్ వాడినట్లు అనుమానం ఉందని, 24 గంటలలోపు వారి బ్లడ్‌ శ్యాంపుల్స్‌ సేకరిస్తామని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. అలాగే పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మెగా డాటర్ నిహారికకు, రాహుల్ సిప్లిగంజ్‌కు నోటీసులు జారీ చేసి విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. అలాగే వీరిద్దరిని మరోసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.