పాన్ కార్డు (PAN Card)కు విశిష్ట గుర్తింపు కార్డు (ఆధార్‌) కార్డును లింక్ చేసుకునేందుకు ఈ రోజు తుది గడువుగా ఉంది. ఈ విషయాన్నీ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది. ఆదాయపన్ను రిటర్నులు దాఖలుతోపాటు ఇతర ఐటీ వ్యవహారాల కోసం ఇక మీదట పాన్‌ కార్డును ఆధార్‌ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరని వెల్లడించింది. ఇప్పటికే PAN – Aadhaar అనుసంధానం తుది గడువును ప్రభుత్వం చాలాసార్లు పొడిగించిందని, అయితే గడువు దాటిన తర్వాత లింక్ చేసేవారికి రూ.1000 వరకు ఫైన్ విధిస్తామని తెలిపింది. డెడ్ లైన్ ముగిసిన 90 రోజుల వరకు లింక్ చేఉకునే వారికి రూ.500 ఫైన్ , ఆ తర్వాత అనుసంధానం చేసేవారికిరూ.1000 ఫైన్ గా విధిస్తామని తెలిపింది.

ఇక ఆధార్‌-పాన్‌ లింక్ చేసుకునేందుకు ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌ https://eportal.incometax.gov.in/ లేదా https://www.utiitsl.com/ లేదా https://www.egov-nsdl.co.in/ లో లాగిన్‌ కావాల్సి ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. కాగా, ఈ ఏడాది జనవరి 24వరకు 43.34 కోట్ల పాన్‌-ఆధార్‌ వివరాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు 131 కోట్ల ఆధార్‌ కార్డులు జారీ అయ్యాయి. అయితే ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధానం చేసుకోవడం సులభమే అయినా.. కొన్ని సందర్భాల్లో రెండు లింక్ అవకకపోవచ్చు. ఎందుకంటే ఆధార్, పాన్ కార్డుల్లో పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు వేర్వేరుగా ఉన్నా కూడా రెండు అనుసంధానం కావు. అప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డుల్లో వివరాలను సరిచేయాలి.