తెలుగు చిత్రసీమలో పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి, గీతా గోవిందం వంటి సినిమాలతో సూపర్ హిట్‌లు కొట్టిన రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ తన కంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో లైగర్‌(Liger) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ధర్మ ప్రొడక్షన్స్- పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లైగర్‌ సినిమా ఆగస్ట్‌25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే లైగర్‌ సినిమా చిత్రీకరణ ముగిసిన తర్వాత విజయ్‌ దేవరకొండ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా సమంత(Samantha) హీరోయిన్‌గా నటించనున్న సంగతి తెలిసిందే.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈనెల 21నే ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో జరగనున్న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఏప్రిల్ 23నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కశ్మీర్‌లో జరగనున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ సినిమా కశ్మీర్‌ నేపథ్యంలో సాగే ప్రేమ కథ అని, ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ మిలటరీ ఆఫీసర్‌గా కనిపించనున్నారని సమాచారం.