పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్(Pawan Kalyan) ప్ర‌స్తుతం మంచి జోరు మీదున్నాడు. వరుసగా సినిమాల‌ను చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇటీవల భీమ్లా నాయక్‌తో మంచి సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ఆయన ప్రస్తుతం క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Viramallu) సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అయితే గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నూతన షెడ్యూల్ కోసం చిత్రబృందం సిద్ధమైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ సెట్ ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో ‘హరి హర వీరమల్లు’ చిత్రంలోని అగ్ర భాగం చిత్రీకరణ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.

రామోజీ ఫిల్మ్ సిటీ షెడ్యూల్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం. కాగా, దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ వజ్రాలదొంగ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నట్లు సమాచారం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడెక్షన్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది.