పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌(Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రాజెక్ట్‌ కె’. దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం 2022లో ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కథ మ‌హాభార‌తంలోని కొన్ని పాత్ర‌ల‌ను ప్రేరణగా చేసుకుని నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్నాడ‌ట‌. అయితే ప్రాజెక్ట్-కె పేరులోని కె అంటే క‌ల్కి అని , మ‌హాభారతంలో విష్ణుమూర్తి క‌ల్కి అవ‌తారన్ని ఆధారంగా చేసుకొని ప్రభాస్ పాత్ర రూపొందనున్నట్లు స‌మాచారం. అలాగే మ‌హాభార‌తంలో మ‌రో కీలక పాత్ర అశ్వ‌థ్థామ పాత్ర ఆధారంగా చేసుకుని అమితాబ్ బచ్చన్ పాత్ర ఉండ‌నున్న‌ట్లు సమాచారం.ఈ రెండు పాత్ర‌ల‌ను ప్రేరణగా చేసుకుని నాగ్ అశ్విన్ సినిమా తెరకెక్కిస్తున్న‌ట్లు సమాచారం.