ప్రభాస్‌(Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్‌’(Radhe Shyam). జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ సినిమాను నిర్మించారు. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్‌ పాత్రలో అలరించింది. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించింది.

ఈ నేపథ్యంలో రాధేశ్యామ్‌ సినిమాపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాధేశ్యామ్‌లో హీరో ప్రభాస్‌ రెమ్యునరేషన్ కాకుండా.. ఈ సినిమాకి కేటాయించిన మొత్తం బడ్జెట్‌లో ఐదో వంతు బడ్జెట్ తో సినిమా తీసేయవచ్చు. రాధేశ్యామ్‌ ఒక లవ్‌స్టోరీ అలాంటి దానికి విజువల్‌ ఫీస్ట్‌ అనవసరం. ప్రేమ కథలోని ఎమోషన్స్ ను విజువల్‌ ఫిస్ట్‌ చంపేస్తుంది అని రాంగోపాల్ వర్మ అన్నాడు. ఇక ఇటీవల విడుదలైన బాలీవుడ్‌ మూవీ ది కశ్మీర్‌ ఫైల్స్‌ కేవలం రూ. 5 కోట్లతో తెరకెక్కి ఇప్పుడు రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందని వర్మ అన్నాడు. విజువల్‌ ఫిస్ట్‌ కంటే కూడా కథలో కంటెంట్ ఉండాలని వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.