ప్రభాస్‌-పూజ హెగ్డే హీరోహీరోయిన్‌గా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. కె. రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించిన ఈచిత్రాన్ని వంశీ, ప్రమోద్‌, ప్రసీధలు సంయుక్తంగా నిర్మించారు. ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్‌ ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా మహ్మమ్మరి విజృంభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా విడుదల చేయడం సరైంది కాదని ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని వాయిదా వేశారు నిర్మాతలు. ఈ క్రమంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ‘రాధేశ్యామ్’ సినిమాని కూడా వాయిదా వేస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ మేరకు ట్విట్టర్ లో ‘రాధేశ్యామ్’ హ్యాష్ ట్యాగ్ ఆదివారం ట్రెండ్ అయింది.. అయితే ఈ పుకార్లపై రాధేశ్యామ్‌ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ స్పందించింది. ఈ ఊహగానాలను నమ్మకండంటూ  కీలక ప్రకటన చేసింది. ‘రాధేశ్యామ్ విడుదల కావడం లేదన్న ప్రచారాన్ని నమ్మకండి. ఈ నెల 14 తేదినే సినిమాను విడుదల చేస్తున్నాం’ అని అభిమానులకు మరోసారి క్లారిటీ ఇచ్చింది. కాగా, ఈ సినిమా  వింటేజ్ పీరియాడికల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఇందులో హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్యగా ప్రభాస్ కనిపించనున్నారు.